టీ20 సూపర్-8: పాక్‌పై లంక ఘనవిజయం

ట్వంటీ-20 వరల్డ్‌కప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 19 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. బదులుగా 151 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేయడం ద్వారా ఓటమి పాలైంది. శ్రీలంక బౌలర్లు పూర్తి ఆధిపత్యం కనబర్చడంతో పాక్ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.

ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ బట్‌(0)ను మాథ్యూస్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అయితే అక్మల్‌తో కలిసి షోయబ్‌ మాలిక్‌ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచేందుకు ప్రయత్నించాడు. ధాటిగా ఆడిన మాలిక్‌ 20 బంతుల్లోనే 5ఫోర్లతో 28 పరుగులు చేశాడు. అయితే మలింగ అతన్ని ఔట్‌ చేసి పాక్‌ను మళ్లీ కష్టాల్లోకి నెట్టాడు. రెండు బంతుల తర్వాత అక్మల్‌ కూడా వెనుదిరిగాడు.

దీంతో పాకిస్థాన్‌ 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. అయితే మిస్బాతో కలిసి యూనిస్‌ పాక్ ఇన్నిం
గ్స్‌ను కుదుటపరిచాడు. వీరిద్దరూ సమన్వయంతో ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించారు. మిస్బా నెమ్మదిగా ఆడగా యూనిస్‌ వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు కొట్టాడు. వీరి భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న దశలో మురళీధరన్‌ వరుస బంతుల్లో మిస్బా(20), ఆఫ్రిది(0) వికెట్లను పడగొట్టి పాకిస్థాన్‌ ఓటమిని ఖాయం చేశాడు.

దీంతో యూనిస్‌ 30 బంతుల్లో 5ఫోర్లతో 50 పరుగులు చేసిన ఫలితం లేకుండా పోయింది. లంక జట్టులో మలింగ మూడు, మురళీ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక 150 పరుగులు చేసింది. దిల్షాన్‌ (46), జయసూర్య(26) మరోసారి రాణించారు. ప్రారంభంలో ధాటిగా ఆడిన లంకను చివర్లో పాక్‌ బౌలర్లు కట్టడి చేశారు. ఉమర్‌, ఆఫ్రిది, అజ్మల్‌ తలా మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా లంకను 150 పరుగులకు కట్టడి చేశారు.

వెబ్దునియా పై చదవండి