ఎస్సీ వర్గీకరణకు భారాస చిత్తశుద్ధితో పని చేస్తుంది : మాజీ మంత్రి కేటీఆర్

వరుణ్

గురువారం, 1 ఆగస్టు 2024 (15:33 IST)
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు తమ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తుంది భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కల్పన కోసం ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణకు అనుమతి ఇస్తూ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ తన తీర్పులో స్పష్టం చేసింది. విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమంజసమేనని తేల్చి చెప్పింది. 
 
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదంటూ 2004లో ఇచ్చిన తీర్పును 'సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం గురువారం పక్కనబెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయకూడదంటూ ఇచ్చిన నాటి తీర్పును కొట్టివేసింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది.
 
ఈ బెంచ్‌‍లో, ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ ఒక్క జస్టిస్ బేలా త్రివేది మాత్రమే అభ్యంతరం తెలిపారు. ఉపవర్గీకరణకు సీజేఐ చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సతీశ్ చంద్ర, జస్టిస్ మనోజ్ మిశ్రా అనుకూలంగా తీర్పు ఇచ్చారు. సుప్రీం తీర్పును అనుసరించి రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. ఆ మార్గదర్శకాలు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని నిర్దేశించింది. 
 
ఈ తీర్పుపై కేటీఆర్ స్పందిస్తూ, ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తాము అసెంబ్లీలో తీర్మానం చేశామని గుర్తుచేశారు. వర్గీకరణకు మద్దతుగా తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ కూడా రాశారని తెలిపారు. ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలు మాత్రం ఓట్ల రాజకీయం చేశాయని ఆయన విమర్శించారు. 
 
మరోవైపు, ఎస్సీ వర్గీకరణ తీర్పును తెలంగాణ బీజేపీ స్వాగతించింది. ఈ మేరకు ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి స్పందిస్తూ, ఎస్సీ వర్గీకరణకు ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణంగా సహకరించారని, వర్గీకరణ ప్రక్రియకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు