తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఈ ప్రభావం కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
ముఖ్యంగా, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఐదు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి.
అయితే, ఆగస్టు చివరి వారానికి చేరుకుంటున్నా.. తెలంగాణలోని పది జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. దీంతోపాటు రాష్ట్ర సగటు శాతం కూడా తగ్గుతూ వస్తోంది. ఈ నెలలో కురిసిన అతి భారీ వర్షాలతో 18వ తేదీ నాటికి రాష్ట్ర సగటు.. సాధారణం కన్నా 14 శాతం అధికంగా నమోదైంది. ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సోమవారం నాటికి తొమ్మిది శాతం లోటు నమోదైంది.
నిర్మల్ జిల్లాలో సాధారణం కన్నా 44 శాతం, పెద్దపల్లి (21), జయశంకర్ భూపాలపల్లి (13), నల్గొండ (13), నిజామాబాద్ (12), జగిత్యాల (12), రాజన్న సిరిసిల్ల (11), మంచిర్యాల (10), సంగారెడ్డి (6), మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4 శాతం లోటు వర్షపాతం నమోదైంది.