ఎయిర్లైన్స్ ప్రతినిధుల నిర్లక్ష్యంతో కొందరు ప్రయాణికులను విమానాశ్రయంలోనే ఓ విమానం వదిలి వెళ్లింది. ఇండిగో ఎయిర్లైన్స్ ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ముంబైకి, అక్కడి నుంచి డాలస్ వెళ్లాల్సిన కొందరు ప్రయాణికులను ఇక్కడే వదిలేసి విమానం వెళ్లిపోయింది. బాధిత ప్రయాణికులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ నుంచి డాలస్ వెళ్లాల్సిన 38 మంది టర్కిష్ ఎయిర్లైన్స్ వెబ్సైట్ సూచన మేరకు ఇండిగో ఎయిర్ లైన్స్ టై అప్ టికెట్లను ఆన్లైన్లో రూ.2 లక్షల చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు.
వీరు శంషాబాద్ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 11.40 గంటలకు ముంబై వరకు ఇండిగో ఎయిర్ లైన్స్ 6ఇ-5195 విమానంలో, అక్కడి నుంచి టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానంలో డాలస్కు వెళ్లాలి. 38 మంది ప్రయాణికులు శనివారం శంషాబాద్ విమానాశ్రయానికి సకాలంలో చేరుకుని ఎయిర్ లైన్స్ కేంద్రంలో సంప్రదించారు.
ఓవర్ బుకింగ్ పేరుతో విమాన ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రతినిధులు సర్వీస్ నంబరును 6ఇ-6132గా మార్చారని, అందులో 24 మందినే ఎక్కించుకుని ముంబైకి పంపించారని మిగతా ప్రయాణికులు ఆరోపించారు. దీనిపై ఇండిగో ప్రతినిధులను నిలదీయగా పొంతనలేని సమాధానాలిచ్చారంటూ ఆందోళనకు దిగారు. దాదాపు ఏడు గంటలపాటు విమానాశ్రయంలోనే వేచిఉన్న అనంతరం వారు వెనుదిరిగారు.