తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది : నితిన్ గడ్కరీ

ఠాగూర్

శుక్రవారం, 1 మార్చి 2024 (15:40 IST)
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గురువారం జరిగిన కొమురం భీమ్ క్లస్టర్ విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ, దేశ ముఖ చిత్రాన్ని మార్చే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో అనేక గ్రామాలు అధ్వాన్నంగా తయారయ్యాయని చెప్పారు. రోడ్లు, తాగునీరు సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. 
 
ప్రభుత్వ ఆస్పత్రులు అందుబాటులో లేక అనేక గ్రామాలు ఖాళీ అయ్యాయన్నారు. రోడ్ల నిర్మాణాల కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అందుబాటులోకి తెచ్చామన్నారు. విమానాలకు ఇంధనం అందించే సామర్థ్యం మన రైతుల్లో ఉందన్నారు. రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చి వారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 
 
గత తొమ్మిదేళ్లపాటు భారత రాష్ట్ర సమితి, ఇపుడు ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప ప్రజా సంక్షేమం ఎక్కడా లేదన్నారు. ఇక్కడ సాగు అవుతున్న పసుపు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుందన్నారు. దేశంలో రూ.2 లక్షల కోట్లతో రోడ్లను, ఎక్స్‌ప్రెస్‌ హైవేలుగా నిర్మిస్తున్నట్టు చెప్పారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడితేనే వ్యాపార, వాణిజ్య రంగాలు పర్యాటక రంగ అభివృద్ధికి దోపదపడుతాయన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు