కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోమారు విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేయొచ్చంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అన్నారు. దీనిపై రాజా సింగ్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి సహాయం అడుగుతున్న వారికి చెవులు ఉన్నా వినపడవని వ్యాఖ్యానించారు. నోరు ఉండి కూడా చెప్పరంటూ రాజాసింగ్ అన్నారు. అలాంటి మహానుభావులను అడిగితే ఏం సహాయం చేస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు.
నిజానికి రాజాసింగ్, కిషన్ రెడ్డిల మధ్య గత కొంతకాలంగా కోల్డ్వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నాయకుడినే లక్ష్యంగా చేసుకుని గోషామహల్ స్థానం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజా సింగ్ విమర్శలు గుప్పించారు.
రాజాసింగ్ వేదికపై నుంచే కిషన్ రెడ్డిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వారిద్దరి మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. వీరి మధ్య విభేదాలకు సంబంధించి పలు సందర్భాల్లో కిషన్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అలాంటివి పార్టీలో లేవని కొట్టిపారేశారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వాటిని తామే పరిష్కరించుకుంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కానీ చాలా కాలంగా కిషన్ రెడ్డి విషయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఇదే రకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలోనూ అభ్యర్థిని బీజేపీలో అందరూ సమర్థిస్తే రాజాసింగ్ మాత్రం బాహాటంగానే విమర్శించారు. ఆ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే రాజాసింగ్తో మాట్లాడి సముదాయించిన విషయం తెలిసిందే.