మాజీ సీఎం కేసీఆర్‌కు షాక్.. భారాసకు టి.రాజయ్య రాజీనామా

ఠాగూర్

ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (17:49 IST)
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.రాజయ్య భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేశాు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించి, దాన్ని ఆమోదించాలని కోరారు. హన్మకొండలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, భారాసలో తనకు ఏమాత్రం గుర్తింపు లేదన్నారు. పార్టీలో ఆరు నెలలుగా సాగుతున్న పరణామాలు తనను, తన అనుచర వర్గాన్ని మానసింగా వేదనకు గురి చేశాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కొందరు నాయకులు అప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 
 
భారాస పదేళ్లపాటు అధికారంలో ఉందని, కాంగ్రెస్ పార్టీకి కనీసం పది నెలల సమయమైనా ఇవ్వలేమా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన పోరాటం చేయలేమా అని నిలదీశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకున్నా స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్థుల విజయానికి కృషి చేశానని ఆయన తెలిపారు. అయినా పార్టీలో తగిన ఆదరణ దక్కడం లేదని పేర్కొన్నారు. కాగా, రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే, మరో రెండు మూడు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు