మూఢ నమ్మకానికి బలైన బాలిక... 68 రోజులు ఉప‌వాస దీక్ష చేసి ...

శనివారం, 8 అక్టోబరు 2016 (15:18 IST)
మూఢ నమ్మకానికి 13 ఏళ్ల బాలిక బలైంది. వ్యాపారంలో లాభాలు రాలేదని చెన్నైకి చెందిన ఓ మత గురువు సలహాతో కన్న కూతురిని 68 రోజుల పాటు ఉపవాసం చేయించాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో ఆ బాలిక మరణించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే...సికింద్రాబాద్‌కు చెందిన లక్ష్మీచంద్ మనీష్ సమదరియా స్థానికంగా బంగారు నగల వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు ఆరాధన అనే 13 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె సికింద్రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. 
 
కొద్దిరోజులుగా లక్ష్మీచంద్ తన వ్యాపారంలో నష్టాలు తప్ప లాభాలు చూడలేదు. దాంతో చెన్నైకు చెందిన ఓ మత గురువుతో వ్యాపార నష్టాల గురించి వివరించాడు. ఆ మత గురువు లక్ష్మీచంద్ కుమార్తెను 68 రోజుల పాటు ఉపవాసం ఉంచితే వ్యాపారంలో అభివృద్ధి చెందుతావని అతడికి ఉపాయం చెప్పాడు. దీంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఆరాధనతో 68 రోజుల పాటు ఉపవాసం చేయించాడు. జైన మత ఆచారం ప్రకారం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు మాత్రమే నీళ్లు తాగాలి. ఆహారం ముట్టుకోవద్దు.
 
కాగా 68 రోజుల ఉపవాసం ఈ నెల 3వ తేదీకి ముగిసింది. కానీ అప్పటికే ఆరాధన డీహైడ్రేషన్‌కు గురై, శరీరంలో కిడ్నీలు సహా పలు అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెను ఆస‌ుప‌త్రికి త‌ర‌లించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. దీనిపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు, గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి