ఇకపై అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్.. భూరికార్డులు ఇక ఆన్‌లైన్‌లోనే..

గురువారం, 29 అక్టోబరు 2020 (15:07 IST)
తెలంగాణలో ఇకపై అక్రమ రిజిస్ట్రేషన్లకు తావు లేదు, అన్ని భూరికార్డులు ఆన్‌లైన్‌లోనే జరుగనున్నాయి. ఇందులో భాగంగా ధరణి పోర్టల్ ప్రారంభంతో భూ రికార్డుల నిర్వహణ ప్రక్రియ నేటితో ప్రారంభమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భూ రిజిస్ట్రేషన్ల విషయంలో పాత రిజిస్ట్రేషన్ ఛార్జీలే వర్తిస్తాయని ఆయన తేల్చిచెప్పారు. రిజిస్ర్టేషన్ ఛార్జీల్లో ఒక్క పైసా కూడా పెంచలేదన్నారు. ఈ పోర్టల్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లకు తావు ఉండదన్నారు. 
 
రిజిస్ట్రేషన్ల కోసం పైరవీలు చేసే అవసరం ఉండదన్నారు. మీ-సేవా, ధరణి పోర్టల్ వ్యక్తిగతంగా కార్యాలయానికి వెళ్లి భూములు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు అని తెలిపారు. ధరణి పోర్టల్ నమూనా పత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. నమూనా పత్రాల ఆధారంగా ఎవరికి వారే రిజిస్ర్టేషన్ ప్రక్రియ చేసుకోవచ్చు. కొత్తగా జరిగే క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తవుతుంది.
 
ఒక వేళ డాక్యుమెంట్ రైటర్ల సహాయం కావాలంటే వాళ్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్లు గతంలో లాగా ఎలా పడితే అలా రుసుం వసూలు చేసేందుకు వీల్లేదన్నారు. డాక్యుమెంట్ రైటర్లు తీసుకోవాల్సిన రుసుం కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. 
 
డాక్యుమెంట్ రైటర్ల పేర్లను జిల్లా కలెక్టర్లు ప్రకటిస్తారని తెలిపారు. ధరణి పోర్టల్‌లో 99 శాతం సాంకేతిక సమస్యలు రాకుండా రూపకల్పన చేశామన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించే బృందాలు అందుబాటులో ఉంటాయని సీఎం స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు