ఇంట్లో పూలకుండీల్లో గంజాయి మొక్కల పెంపకం

సోమవారం, 8 నవంబరు 2021 (16:12 IST)
తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి సాగుపై ఆ రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులోభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన ఇంట్లోనే పూలకుండీల్లో గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారం సికింద్రాబాద్ యాప్రాల్‌లో వెలుగు చూసింది. 
 
హైదరాబాద్‌ జవహర్‌నగర్‌కు చెందిన వ్యక్తి నిర్వాకమిది. స్థానికంగా బేకరీ నడిపే పిల్లుట్ల వెంకట నర్సింహశాస్త్రి కొన్నాళ్ల క్రితం కుటుంబంతో పాటు నేరేడ్‌మెట్‌ డివిజన్‌ యాప్రాల్‌ గోదావరి గార్డెన్‌లో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. 
 
ఇతనికి గంజాయి తీసుకొనే అలవాటుంది. అయితే, ఇటీవల పోలీసు నిఘా పెరగడంతో సరుకు లభించడం కష్టంగా మారింది. వ్యసనం వీడలేని నర్సింహ శాస్త్రి ఇంటిపైనే మొక్కలు పెంచడం మొదలుపెట్టాడు.
 
ఇందుకు కొత్తగా కుండీలు కొని ఏడు మొక్కలు వేశాడు. ఇంటి యజమాని విదేశాల్లో ఉండడంతో పట్టించుకునేవారు లేరు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న జవహర్‌నగర్‌ పోలీసులు తనిఖీ చేశారు. 
 
ఈ కుండీల్లో 4 అడుగుల మేర పెరిగిన గంజాయి మొక్కలను గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేశారు. కొద్ది రోజుల వ్యవధిలోనే వందల కిలోల గంజాయితోపాటు పదుల సంఖ్యలో విక్రేతలను, సరఫరాదారులను పోలీసులు అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు