ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితపై ఆరోపణలు చేయొద్దు : కోర్టు ఆదేశం

బుధవారం, 24 ఆగస్టు 2022 (17:24 IST)
ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం స్కామ్‌లో తెరాస ఎమ్మెల్సీ కవితపై ఎలాంటి ఆరోపణలు చేయొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు ప్రధానంగా వినిపిస్తుంది. దీంతో ఆమెను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ బీజేపీ నేతల విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
వీటిని కవిత ఖండించినప్పటికీ వారు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఆమె బీజేపీ నేతలపై రాష్ట్రంలోని 33 జిల్లా కోర్టుల్లో పరువు నష్టందావా వేశారు. అంతేకాకుండా తనపై ఆరోపణలు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆమె సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. 
 
దీనిపై విచారణ జరిపిన కోర్టు... మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంలో ఇకపై కవితకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు చేయరాదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మీడియాలోనే కాకుడా సోషల్ మీడియాలో కూడా కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు