కేసీఆర్‌కు కరోనా వైరస్ సోకడానికి కారణం ఏంటి?

మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (14:51 IST)
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఆయన ప్రస్తుతం తన ఫాం హౌస్‌లో క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే, అత్యంత జాగ్రత్తగా ఉండే కేసీఆర్‌కు ఈ వైరస్ సోకిందన్నదే ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఇటీవల నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సభ తర్వాతే కేసీఆర్‌కు పాజిటివ్ అని వచ్చింది. అలాగే, నాగార్జున సాగర్ అభ్యర్థి నోముల భగత్‌కూ పాజిటివ్.. మరికొందరు నియోజకవర్గ నేతలకూ సోకిన కరోనా సోకింది. అంటే హాలియా సభే కరోనాకు హాట్ స్పాట్‌గా మారిందని నిఘా వర్గాలు సైతం గుర్తించాయి.
 
అంతేకాదు.. ఆ సభకు హాజరైన వారిలో చాలా మందికి మహమ్మారి సోకినట్టు అధికారులు గుర్తించారు. సోమవారం ఒక్కరోజే సాగర్ నియోజకవర్గ పరిధిలో 160 మందికి కరోనా సోకింది. 17న జరిగిన సాగర్ ఉప ఎన్నికల ప్రచారం కోసం.. 14న సీఎం కేసీఆర్ హాలియాలో భారీ సభ నిర్వహించారు. సభ కోసం టీఆర్ఎస్ నేతలు దాదాపు లక్ష మందిని సమీకరించారు. కరోనా నిబంధనలను పట్టించుకోకుండా భారీ సభను నిర్వహించారు.
 
ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్, నోముల భగత్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్య యాదవ్‌‌లకూ పాజటివ్ అని నిర్ధారణ అయింది. ఇప్పుడు సభకు వచ్చిన వారిలో ఇంకా ఎందరికి కరోనా వచ్చి ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క టీఆర్ఎస్ నేతలకే కాదు.. సాగర్ ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్, బీజేపీకి చెందిన కొందరు నాయకులకూ పాజిటివ్ వచ్చింది.
 
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు గన్‌మెన్‌లకు పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఎన్నికల సభలు, ప్రచారం కోసం ప్రజలు ఎక్కడికక్కడ గుమికూడడం, ప్రజలను కలవడం, ఎక్కడా కరోనా నిబంధనలను పట్టించుకోకపోవడం వంటి కారణాలతోనే సాగర్ నియోజకవర్గంలో ఇప్పుడు కరోనా కల్లోలానికి కారణమని అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు