వైఎస్ షర్మిల కొత్త పార్టీ ముహూర్తం ఫిక్స్.. టీఆర్‌ఎస్‌కో, బీజేపీకో 'బి'టీమ్‌గా..?

బుధవారం, 17 మార్చి 2021 (09:24 IST)
వైఎస్ షర్మిల కొత్త పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో అనేక చోట్ల ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పైనే దృష్టి సారించడంతో షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
 
ఇందులో భాగంగానే షర్మిల అన్ని జిల్లాల నేతలు, వైఎస్ అభిమానులతో వరసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో పార్టీని ప్రకటించబోతున్నారని సమాచారం. పార్టీని పార్టీ జెండా, సిద్ధాంతాలను కూడా అదే రోజున ప్రకటించే అవకాశం ఉంది. 2023 ఎన్నికలే లక్ష్యమా షర్మిల పార్టీని ముందుకు నడిపించే అవకాశం ఉంది.
 
ఖమ్మం వేదికగా ఏప్రిల్‌ 9న లక్ష మంది సమక్షంలో పార్టీని ప్రకటించేందుకు నిర్ణయించారు. లోటస్‌ పాండ్‌లోని తన కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలు, వైఎస్‌ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పార్టీ ఏర్పాటు, విధివిధానాల విషయంలో పార్టీ నేతలకు ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చారు.
 
టిఆర్‌ఎస్‌కో, బిజెపికో 'బి'టీమ్‌గా ఉండాల్సిన అవసరం తనకు లేదని షర్మిల స్పష్టం చేశారు. సమస్యల సాధనకు మాత్రమే తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేశానని చెప్పారు. పార్టీ విధివిధానాలపై మేధావులు, సీనియర్‌ నేతలతో చర్చిస్తున్నామని చెప్పారు. ప్రజల కేంద్రంగా పార్టీ జెండా, ఎజెండా రూపొందుతుందని అన్నారు.
 
అయితే, రాజకీయ వర్గాలు ముందునుంచే భావిస్తున్నట్టు ఖమ్మం జిల్లా కేంద్రంగా కొత్త పార్టీ ప్రకటిస్తుండటం పట్ల ఆ జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎక్కడి నుంచి షర్మిల పోటీ చేసినా బంపర్‌ మెజార్టీతో గెలిపిస్తామని ఆ జిల్లా నేతలు చెప్పారు. వైయస్‌ అభిమానులుగా ఆ బాధ్యత మాపై ఉందన్నారు. కాగా, ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని పలువురు వైఎస్‌ అభిమానులు షర్మిలను కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు