తెలంగాణాలో ప్రత్యేక ఉపాధ్యాయ కొలువుల భర్తీకి ఆర్థిక శాఖ ఓకే...

ఆదివారం, 27 ఆగస్టు 2023 (14:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఆ రాష్ట్ర ఆర్థికశాఖ పచ్చ జెండా ఊపింది. ఇందులోభాగంగా, మొత్తం 1523 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 91 పోస్టులు ఉన్నాయి. 
 
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేందుకు రాష్ట్రంలో తొలిసారి 1523 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొలువులను పాఠశాల విద్యాశాఖ నిర్వహించే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) ద్వారా భర్తీ చేస్తామని తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
ఈ పోస్టుల్లో ప్రాథమిక పాఠశాలల్లో 796, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 727 కొలువులను మంజూరు చేశారు. రాష్ట్రంలో మొత్తం 18,857 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాకు 91, అతి తక్కువగా సిరిసిల్ల జిల్లాకు 20 కొలువులు మంజూరు చేశారు.
 
కాగా, జిల్లాల వారీగా ఉన్న పోస్టుల వివరాలను పరిశీలిస్తే, నాగర్‌కర్నూల్‌ 84, రంగారెడ్డి 78, సూర్యాపేట 74, కామారెడ్డి 72, నిజామాబాద్‌ 69, సంగారెడ్డి 65, కొత్తగూడెం 56, ఖమ్మం 56, యాదాద్రి 55, హైదరాబాద్‌ 54, మెదక్‌ 53, సిద్దిపేట 52, వికారాబాద్‌ 49, మహబూబ్‌నగర్‌ 43, నిర్మల్‌ 40, జగిత్యాల 39, ఆదిలాబాద్‌ 38, జనగామ 38, వరంగల్‌ 37, మహబూబాబాద్‌ 36, వనపర్తి 36, మంచిర్యాల 34, గద్వాల 31, నారాయణపేట 31, కరీంనగర్‌ 30, హన్మకొండ 30, మేడ్చల్‌ 30, పెద్దపల్లి 27, ఆసిఫాబాద్‌ 26, భూపాలపల్లి 25, ములుగు 24 చొప్పున ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు