హీరో కృష్ణ సతీమణి విజయనిర్మల ఇకలేరు... గుండెపోటుతో కన్నుమూత

గురువారం, 27 జూన్ 2019 (09:32 IST)
సూపర్‌స్టార్ హీరో కృష్ణ సతీమణి విజయనిర్మల ఇకలేరు. ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 73 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికితోడు గుండెపోటు రావడంతో కన్నుమూశారు. 
 
కాగా, 20 ఫిబ్రవరి 1946లో జన్మించిన విజయనిర్మల ఏడేళ్ల వయసులో 'మత్స్యరేఖ' అనే తమిళ చిత్రం ద్వారా బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. పదకొండేళ్ల వయసులో 'పాండురంగ మహాత్మ్యం' అనే చిత్రంతో తెలుగు సినీ వెండితెరకు పరిచయమయ్యారు. 
 
‘రంగులరాట్నం’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన విజయనిర్మల దాదాపు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మెప్పించారు. పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు, అల్లూరి సీతారామరాజు, తాతామనవడు, కురుక్షేత్రం, తదితర చిత్రాల్లో నటించారు. 
 
'పెళ్లి కానుక' సీరియల్‌తో బుల్లితెర ప్రవేశం చేసి అలరించారు. విజయనిర్మల మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు సీనియర్ నరేశ్ ఆమె కుమారుడే. విజయనిర్మల మృతి వార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు