కౌన్ బనేగా కరోడ్‌పతిలో పవన్ కళ్యాణ్‌పై ప్రశ్న - రూ.1.60 లక్షల ప్రైజ్‌మనీ

ఠాగూర్

శనివారం, 14 సెప్టెంబరు 2024 (11:16 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో చెరగని ముద్రవేసిన హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన సినీ నటుడుగాకాకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో అందరికంటే ముందు ఉంటాడు. ఇపుడు ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ పార్టీ అధినేతగా ఉన్నారు. గత ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి 100 శాతం విజయంతో అన్ని సీట్లను కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రఖ్యాత కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ప్రశ్న అడగటం గమనార్హం. 
 
ప్రస్తుతం బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ 16వ సీజన్‌ విజయవంతంగా సాగుతుంది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బీ ఓ కంటెస్టెంట్‌ను పవన్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు. 2024లో జూన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించిన నటుడు ఎవరు అంటూ హోస్ట్ అడిగారు. ఈ ప్రశ్నకు కంటెస్టెంట్ ఆడియన్స్‌ పోల్‌ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఈ ఆడియన్స్‌లో 50 శాతం మందికి పైగా పవన్ అని చెప్పారు. దీంతో కంటెస్ట్ పవన్ పేరును చెప్పి లాక్ చేశారు. అది సరైనా సమాధానం కావడంతో కంటెస్టెంట్ రూ.1.60 లక్షలు గెలుచుకుని తర్వాత ప్రశ్నకు వెళ్లారు. 
 
కాగా, ప్రస్తుతం రాజకీయాల్లో అత్యంత బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఇప్పటికే కమిట్ అయిన మూడు సినిమాల కోసం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. వీటిలో "ఓజీ", "హరిహర వీరమల్లు", "ఉస్తాద్ భగవత్ సింగ్" సినిమాల షూటింగులను పూర్తి చేయాల్సివుంది. వీటిలో హరిహర వీరమల్లు షూటింగ్ ఈ నెల 23వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు. వచ్చే యేడాది గణతంత్ర వేడుకలకు విడుదల చేయాలని లక్ష్యంతో ఈ సినిమా నిర్మాణ పనులను పూర్తి చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు