తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణవార్త నన్నెంతో కలిచి వేసిందని, ఆమెమ మృతి తీరని లోటని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ... సినిమా రంగం, రాజకీయాల్లో జయలలిత తనదైనముద్ర వేశారు. నాన్నగారితో కూడా ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన జయలలిత సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. అలాగే అనేక సవాళ్లతో కూడిన రాజకీయాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఆరు సార్లు ఎన్నిక కావడం చాలా గొప్పవిషయం. ఎంతో మంది మహిళలకు, పోరాట శక్తికి ఆమె నిదర్శనం. ఇటువంటి లీడర్స్ అరుదుగా ఉంటారు. ఇటువంటి గొప్ప నాయకురాలు మనల్ని విడిచిపెట్టి అనంత లోకాలకు వెళ్లడం ఎంతో బాధాకరం. జయలలిత మరణం సినీ రంగానికే కాదు, రాజకీయ రంగానికి కూడా తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
అలాగే, మరో హీరో డాక్టర్ మోహన్ బాబు స్పందిస్తూ... తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితగారి ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. గొప్ప జనాకర్ష నేత, అంత కంటే గొప్ప మనసున్న వ్యక్తి, మహిళా శక్తికి నిద్శనం జయలలితగారు. నా కెరీర్ ప్రారంభంలో ఆమెను చాలా సార్లు కలిసి మాట్లాడాను. కలిసిన ప్రతిసారి గొప్ప అదృష్టంగా భావించాను. గొప్ప నటి, రాజకీయ నాయకురాలు. జయలలిత మరణం తమిళ సోదరీ సోదరీమణులకు తీరనిలోటు. ఆమె మనల్ని విడిచిపెట్టి వెళ్లడం చాలా బాధాకరం. మాటలు రావడం లేదు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.