బాలకృష్ణ ఆదిత్య 369కు మూడు దశాబ్దాలు

ఆదివారం, 18 జులై 2021 (10:12 IST)
యువరత్న బాలకృష్ణ, మోహిని, సిల్క్ స్మిత కాంబినేషన్‌లో సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించిన చిత్రం ఆదిత్య 369. ఈ చిత్రం విడుదలై 30 సంవత్సరాలు దాటింది. టైమ్ మెషీన్ కాన్సెప్టుతో పూర్తిగా ఫిక్షన్ మూవీగా 'ఆదిత్య 369' వచ్చింది. ఈ మూవీ తెలుగు సినీ చరిత్రలో ఓ విలక్షణ చిత్రంగా నిలిచిపోయింది. 
 
ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ స్పందిస్తూ, 30 యేళ్ల క్రితం తాను నటించిన చిత్రం విడుదలై 30 ఏళ్లు దాటినా ఇంకా ప్రజాదరణ పొందుతుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆదిత్య 369 సినిమా డిజిటల్ మీడియాలో ఈ తరాన్ని కూడా ఆకర్షిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. 
 
ప్రపంచ సినీ చరిత్రలో సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ, చరిత్ర... ఈ మూడు జోనర్లను మేళవించి తెరకెక్కించిన అతి తక్కువ చిత్రాల్లో మనదేశం నుంచి బహుశా ఇదొక్కటేనేమో అని అభిప్రాయపడ్డారు.
 
'ఇంతటి చిరస్మరణీయ దృశ్య కావ్యానికి నన్ను కథానాయకుడ్ని చేసిన దర్శకశాస్త్రవేత సింగీతం శ్రీనివాసరావు గారికి, నిర్మాతలు స్వర్గీయ ఎస్పీ బాలు, కృష్ణప్రసాద్‌కి, నా ఊపిరితో సమానమైన అభిమానులకు, తరం మారినా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు సదా కృతజ్ఞుడ్ని' అంటూ సోషల్ మీడియాలో స్పందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు