బిగ్ బాస్ షోలో మహాకవి శ్రీశ్రీ కవితను వినిపించిన కమల్ హాసన్

సోమవారం, 16 నవంబరు 2020 (20:45 IST)
Kamal Haasan
మహాకవి శ్రీశ్రీ రాసిన పతితులారా బ్రష్టులారా.. కవితను బిగ్‌బాస్‌ షోలో చదివి వినిపించారు తమిళ బిగ్ బాస్ హోస్ట్ కమల్ హాసన్. కమల్ హాసన్ శ్రీశ్రీకి వీరాభిమాని. ఆకలిరాజ్యంతో పాటు మహానది సినిమాలోనూ శ్రీశ్రీ కవితలు చదివే దృశ్యాలు ఉన్నాయి. నిరుద్యోగ భారతంలో.. ఒక యువకుడి ఆగ్రహం శ్రీశ్రీ కవితల రూపంలో బయటకు వస్తే ఎలా ఉంటుందనేది ఆకలి రాజ్యంలో ప్రతిబింబించారు కమల్ హాసన్‌. 
 
సందర్భం వచ్చినప్పుడల్లా మహాప్రస్థానంలో కవితల్ని డైలాగులుగా సంధించారు. సినిమాల్లో శ్రీశ్రీ కవితలు చెప్పడమే కాదు.. నిజ జీవితంలో కూడా కమల్ హాసన్‌లో వామపక్ష భావాలు ఎక్కువ. ఆకలి రాజ్యం సినిమాకు శ్రీ శ్రీ మహా ప్రస్థానమే స్ఫూర్తి. సకల కళా వల్లభుడిగా... నటనలో నూరు అవతారాలు ఎత్తిన వాడిగా పేరు పొందిన కమల్‌... చాలా సందర్భాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. 
 
ఓ సారి కుమార్తెతో కలిసి ఓ వేదికపై రఘుపతి రాఘవ పాట పాడారు. అదికూడా అప్పట్లో చాలా పాపులర్‌ అయింది. ప్రపంచంలో ఏ సమాజానికైనా సరిపోయేంత ఆవేశం, ఆవేదన శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఉంది. దగాపడిన వాళ్ల ఆవేదన, ఆగ్రహం మహాప్రస్థానంలోని ప్రతీ అక్షరంలో కనిపిస్తుంది. అలాంటి శ్రీశ్రీ కవితను బిగ్ బాస్ షోలో వినిపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు