చచ్చిపోయాను అని పబ్లిసిటీ చేసిన పూనమ్ పాండేపై చర్యలకు నెటిజన్లు డిమాండ్

ఐవీఆర్

శనివారం, 3 ఫిబ్రవరి 2024 (20:22 IST)
పూనమ్ పాండే. ఈ బాలీవుడ్ నటి వివాదాలకు కేరాఫ్ అడ్రెస్. ఆది నుంచి ప్రజలను, నెటిజన్లు ఆకర్షించేందుకు ఏదో ఒక విభిన్నమైన పని చేస్తూనే వుంటుంది. ఆమధ్య ఇండియన్ క్రికెట్ టీమ్ గెలిస్తే నగ్నంగా వారి ముందు నిలబడతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఇన్‌స్టాగ్రాం వేదికగా ఎన్నో చర్చనీయాంశంగా మారే అంశాలను మాట్లాడుతూ వుంటుంది.
 
ఇపుడు అన్నింటికీ పరాకాష్టగా తను చచ్చిపోయినట్లు ఇన్ స్టాగ్రాం ద్వారా వార్తలను షేర్ చేయించింది. ఇదే నిజం అని నమ్మిన ప్రముఖ మీడియా ఛానళ్లు, పత్రికలు.. పూనమ్ పాండే గర్భాశయ కేన్సర్ కారణంగా చనిపోయారంటూ వార్తలు ప్రచురించారు. దీనితో సోషల్ మీడియాలో ఆమె చావుపై విపరీతంగా నివాళులనర్పిస్తూ కామెంట్లు పోస్ట్ చేసారు ఆమె అభిమానులు. ఐతే తాజాగా పూనమ్ అందరికీ షాకిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
 
గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని పూనమ్ పాండే చెప్పింది. ఈ మహమ్మారిపై అవగాహన కల్పించాలనే తాను చనిపోయినట్టు ప్రచారం చేయించామని వెల్లడించింది. తాను బతికే ఉన్నానని స్పష్టం చేసింది. తన మరణ వార్తతో బాధపడిన, ఇబ్బంది పడిన అందరికీ క్షమాపణలు చెపుతున్నానని వెల్లడించింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి చర్యకు పాల్పడిన ఆమెపై తక్షణమే కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి పోలీసులు ఏం చేస్తారన్నది వేచి చూడాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు