కరోనాకు విరాళం.. లక్ష ఇచ్చిన ప్రణీత... హీరోయిన్లలో ఆమే ఫస్ట్

శనివారం, 28 మార్చి 2020 (18:14 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు సినిమా షూటింగ్స్ అన్నీ కూడా రద్దయిన సంగతి అందరికి తెలిసిందే. దీంతో చిన్న స్థాయి కళాకారులు ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇందుకోసం సూపర్ స్టార్ రజనీకాంత్ రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. ఆయన అల్లుడు ధనుష్ కూడా రూ. 15 లక్షలు విరాళం ఇచ్చారు.
 
ఇక దర్శకుడు శంకర్ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. సూర్య, కార్తి, శివకుమార్ కలిసి ఇప్పటికే రూ. 10 లక్షలు ప్రకటించారు. విజయ్ సేతుపతి రూ. 10 లక్షలు, శివకార్తికేయన్ రూ. 10 లక్షలు ప్రకటించారు. అలాగే టాలీవుడ్ హీరోలు పవన్, మహేష్ బాబు వంటి అగ్రహీరోలు విరాళాలు ప్రకటిస్తున్నారు. 
 
మరోవైపు కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమ తాత్కాలికంగా మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల సంక్షేమం నిమిత్తం హీరోలు, దర్శకులు, నిర్మాతలు వారికి తోచిన విరాళాన్ని వారు ప్రకటించారు. అయితే, ఇంత వరకు ఒక్క హీరోయిన్ కూడా విరాళం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ ప్రణీత తన వంతుగా రూ. లక్ష విరాళాన్ని ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచింది.
 
ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ, ఈ కష్టకాలంలో ఒక్కో కుటుంబానికి కనీసం రూ. 2 వేలు అవసరమని... తమ ప్రణీత ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయలతో 50 కుటుంబాలకు సాయం చేస్తామని చెప్పింది. తాను చేస్తున్న సాయం చాలా చిన్నదే అని తెలిపింది. ఎఫర్ట్స్ ఫర్ గుడ్, లాజికల్ ఇండియన్ సంస్థలతో కలిసి హెల్ప్ ద హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రణీత ఫౌండేషన్ 500 కుటుంబాలకు సాయం చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు