ఎన్టీఆర్ తర్వాత ఆయనకే క్రేజ్... పవన్‌కు దిష్టి తగలకూడదు.. పృథ్విరాజ్

ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (17:30 IST)
హీరో పవన్ కళ్యాణ్ నటించిన "భీమ్లా నాయక్‌"కు వైకాపా నేత, సినీ నటుడు పృథ్విరాజ్ చూశారు. ఆ తర్వాత ఆయన పవన్‌తో పాటు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అప్పట్లో తాను సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'అడవి రాముడు' చిత్రాన్ని చూశానని గుర్తుచేశారు. 
 
తన జీవితంలో 'భీమ్లా నాయక్' చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. అప్పట్లో 'అడవి రాముడు' చిత్రాన్ని చూసేందుకు తాడేపల్లిగూడెంలోని విజయా టాకీస్‌కు వెళ్తే అక్కడ భారీగా తరలివచ్చిన అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారన్నారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి క్రేజ్ ఒక్క పవన్ కళ్యాణ్‌కే ఉందన్నారు. 
 
'భీమ్లా నాయక్' క్లైమాక్స్‌తో పాటు రానా, పవన్ కళ్యాణ్ నటించిన సన్నివేశాలు చాలా బాగున్నాయన్నారు. తాను కూడా ఓ ప్రేక్షకుడిగా ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశానని, అదేసమయంలో ఇంత అద్భుతమైన సినిమాలో నటించలేకపోయాననే బాధ తనకు ఉందని, పవన్ కళ్యాణ్‌కు దిష్టి తగలకూడదని కోరుకుంటున్నానని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు