బాలీవుడ్ డ్రగ్ సిండికేట్‌లో రియా చక్రవర్తి యాక్టివ్ మెంబర్! ఎన్సీబీ

గురువారం, 1 అక్టోబరు 2020 (13:39 IST)
బాలీవుడ్ డ్రగ్ దందాలో కీలక సూత్రధారి రియా చక్రవర్తిగా తెలుస్తోంది. ముఖ్యంగా, తన సోదరుడు షోవిక్ చక్రవర్తితో కలిసి ఆమె ఈ దందా కొనసాగించినట్టు ఈ కేసును విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), తన అఫిడవిట్‌ను ముంబై హైకోర్టులో దాఖలుచేసింది. 
 
డ్రగ్ కేసులో అరెస్టు అయిన బాలీవుడ్ హీరో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా ఎన్సీబీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో డ్రగ్స్ ట్రాఫికింగ్‌కు రియా నిధులను అందించిందని, దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వాట్స్ యాప్ చాటింగ్ రూపంలో ఉందని వెల్లడించింది.
 
రియా మొబైల్, ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లో మాదకద్రవ్యాల సరఫరాకు సంబంధించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయని, కేసు విచారణ జరుగుతున్న దశలో బెయిల్‌ను మంజూరు చేస్తే, బయటకు వచ్చి సాక్ష్యాలను నాశనం చేసే అవకాశాలు ఉన్నాయని, బెయిల్ ఇవ్వరాదని కోరింది. పైగా, రియా చక్రవర్తి తరచుగా డ్రగ్స్ సరఫరాదారులతో మాట్లాడుతూ, వారితో సంబంధాలు కొనసాగించారని కూడా ఎన్సీబీ తన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. 
 
సుశాంత్ సింగ్ డ్రగ్స్ వాడతాడన్న సంగతి రియాకు తెలుసునని, అతనికి పలుమార్లు వాటిని అందించింది కూడా ఆమేనని పేర్కొంది. తన ఇంటిలో ఆమె డ్రగ్స్‌ను దాచి పెట్టినట్టు కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
 
సుశాంత్‌తో పాటు సమాజంలో పేరు ప్రతిష్టలున్న ఎంతో మందికి రియా స్వయంగా మత్తు మందులు అందించిందని, డ్రగ్స్ సిండికేట్‌లో ఆమె ఓ యాక్టివ్ మెంబర్ అని, ముంబైకి డ్రగ్స్ తెచ్చే ఎంతో మందితో ఆమెకు సంబంధాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. 
 
ఇందుకు సంబంధించిన చెల్లింపులన్నీ క్రెడిట్ కార్డులు, పేమెంట్ గేట్ వేల మాధ్యమంగా జరిగాయని, పలుమార్లు నగదును కూడా ఆమె చెల్లించిందని తెలుపుతూ, బెయిల్ ఇవ్వరాదని విజ్ఞప్తి చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు