ప్రేక్షకులను 'ఫిదా' చేస్తున్న సాయిపల్లవి.. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌

శనివారం, 24 జూన్ 2017 (02:27 IST)
ప్రేమమ్ సినిమాతో కోట్లాదిమంది  ప్రేక్షకుల హృదయాలను కదిలించిన సాయిపల్లవి, వరుణ్ తేజ్ జంటగా నటిస్తున్న ఫిదా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. మానవ సంబంధాలను అత్యంత సున్నితంగా వ్యక్తీకరించడంలో సుప్రసిద్ధుడైన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఫిదా ట్రైలర్ విడుదలైనప్పటినుంచి సంచలనం కలిగిస్తోంది. అమెరికా అబ్బాయికి, తెలంగాణ అమ్మాయికి మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుందనే దాన్ని తనదైన కుటుంబ విలువలను జోడించడం ద్వారా ఆవిష్కరించారు శేఖర్‌ కమ్ముల. గత చిత్రాల మాదిరిగానే ఇందులోనూ కథానాయిక పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దారు.
 
ఇది హార్ట్‌కి సంబంధించిన మేటర్‌రా.. హార్ట్‌కి.. అని తన ప్రేమ గురించి తెగ బాధపడిపోతున్నారు యువ నటుడు వరుణ్‌ తేజ్‌. ఆయన హీరోగా నటిస్తున్న ఫిదా చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సాయి పల్లవి కథానాయిక. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. 'నా ప్రపోజల్‌ని కాలుతో తన్నింది' అని వరుణ్‌తేజ్‌ డైలాగ్‌ మరింత ఆకట్టుకుంటోంది. ఇక తెలంగాణ యాసలో  బాడ్కోవ్ బొక్కలిరిగిపోతాయ్ అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్‌‌కు ప్రేక్షకులు ముఖ్యంగా తెలంగాణ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
 
లైఫంతా ఆ ముగ్గురు కోతులకు చాకిరి చేసి చచ్చిపోతావే..
ప్రపోజల్‌ని కాలుతో తన్నింది..
అతనితో సగం సగం ఈడ ఉండలేను..
ఈ పిల్లకు లెక్కలేదు.. ఓన్లీ తిక్కే..
అప్పుడు మంచి భాను.. ఇప్పుడు చెత్త భాను..
జీవితాంతం ఒకరితో ఉండాలనుకుంటాం కదా.. అది ఈమే.. అంటూ ట్రైలర్‌లో ఉండే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. 
 
దిల్ రాజు నిర్మాతగా, శేఖర్ కమ్ముల దర్సకత్వంలో వస్తున్న ఫిదా చిత్రాన్ని జులై 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
 

వెబ్దునియా పై చదవండి