సినిమా అంటేనే కల్పితం.. 'సైరా' చిత్రం విడుదలను ఆపలేం : తెలంగాణ హైకోర్టు

మంగళవారం, 1 అక్టోబరు 2019 (14:50 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం విడుదలకు ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉయ్యాలవాడ వంశీయుల నుంచి ఎదురైన సమస్యలను ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ సామర్యపూర్వకంగా పరిష్కరించారు. అలాగే, తెలంగాణ రాష్ట్రంలో కూడా విడుదలకు ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోయాయి. ఈ చిత్ర విడుదలను ఆపలేమంటూ ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. 
 
సైరా నరసింహా రెడ్డి చిత్రం బయోపిక్ చిత్రమని చెప్పి ఇప్పుడు చరిత్ర అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ తమిళనాడు తెలుగు యువత సంఘం నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. 'సైరా' చిత్రం విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. 
 
సినిమాను కేవలం వినోదం పరంగానే చూడాలని కోర్టు హితవు పలికింది. ఎంతోమంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్లు ఎవరూ చూపించలేరని, సినిమాటిక్‌గా ఉండడం కోసం కొంత కల్పితం కూడా ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలో గాంధీజీ, మొగల్ సామ్రాజ్యం విషయంలో కూడా కల్పితం ఉందంటూ హైకోర్టు వివరించింది. సినిమా నచ్చేది, నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలని పిటిషనర్‌కు న్యాయస్థానం సూచించింది.
 
కాగా, దేశ తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడుగా ఉన్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెల్సిందే. ఇది ఐదు భాషల్లో విడుదలకానుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు కిచ్చాసుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు