అబ్బియ్యో.. దొరువులో గుడ్డికొక్కిరాయ్‌లేమైనా జూశావా...?!!

Venkateswara Rao. I

సోమవారం, 13 ఆగస్టు 2012 (20:01 IST)
FILE
తొలకరి జల్లులు. ముక్కుపుటాలను తాకే మట్టి వాసనలు. వరుణుడి రాకతో పుడమి పులకరించడమే కాదు మద్దిబోయినవారిపాలెం రైతులు ఆనంద తాండవం చేస్తారు. చినుక కోసం ఆబగా చూసే ఆ ఊరి రైతులు, చినుకు పలుకరించడంతో విత్తనాలలో వినాయకుడిని పెట్టి.. ఆపై భూమిని దున్ని విత్తులు జల్లి మొలకలకోసం ఎదురుచూస్తారు. మూడోనాటి నుంచి ఒక్కొక్క మొలక భూమి పొరల నుంచి తొంగిచూస్తూ 25వ రోజుకు గాలి తెరలకు తలలు ఆడిస్తూ నవ్వుతూ ఉంటుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు వారికి. ఆపై వరుణుడి కరుణతో మాగాణి భూములన్నీ తడిసి ముద్దయి నాట్లుకు సిద్ధమవుతాయ్.

ఇది ప్రతి ఏటా జరిగే తంతే. కాకపోతే భూమి ఉంది. పొలాలు ఉన్నాయ్. కానీ ఆ పొలాలే ప్రాణాలుగా జీవించిన నాటితరం కదలిపోయింది. వారితోపాటే పొలాలను నమ్ముకుని బతికిన ఎన్నో పక్షులు మాయమై పోతున్నాయ్. ఎక్కడికి పోయాయ్.. అనడిగితే.. మద్దిబోయినవారిపాలెం రైతు లోకంలోకి వెళ్లాల్సిందే.

ఆ ఊరును ఆనుకుని ఓ పిల్లకాలువ. పేరుకు కాలువే కానీ పంటనీరు వరదలప్పుడు మాత్రమే పలుకరిస్తుంది. మిగిలిన రోజులంతా రైతులు దొరువులపై ఆధారపడి పంటలను పండించుకోవాల్సిందే. అట్లాంటి రోజుల్లో ఓ రోజు.. తాతయ్యా అని ఆ ఊరు పిలుచుకునే నాయుడమ్మ ఇంటర్ చదువుతున్న తన కొడుకు శ్రీనుకు పొలంలో ఎరువు చల్లించమని చెప్పి పంపాడు. దాంతో శ్రీను ముర్రగుంట పొలానికేసి బయలుదేరాడు. చేలో వరినారు నాటి వారం రోజులయ్యింది. అప్పుడే దుబ్బు పగులుతూ వరి కుదుళ్లు బలిష్టంగా మారుతున్నాయి.

శ్రీను పొలంకేసి అలా చూశాడు. పొలంపై పురుగులను ఏరుకుని తింటూ పొలం మధ్య మల్లెపువ్వుల్లా ఉన్న తెల్లటి కొంగలు. వాటిని అలా చూస్తూ చేనును ఆనుకుని ఉన్న ఓ మట్టిదిబ్బపై కూచున్నాడు. ఇంతలో వెనక నుంచి..." అబ్బియ్యో... నువ్వు తాతయ్యగోరి అబ్బియ్యవు గదూ.." అని ఓ గొంతు పలుకరించింది.

సమాధానంగా "అవును" అన్నాడు.

మళ్లీ శీను అందుకుని "ఎవర్నువ్వు..?" అని ప్రశ్నించాడు. "మాది కుక్కళోళ్ల పాలెం. అదిగో తూరుపున ఉన్న ఆ తారు రోడ్డవకాడ కనబడతన్న సువ్వ తాటిసెట్టు (తాడిచెట్టు) ఉందే... ఆడ గనబడేదే మా వూరు. నన్ను పోలేరని అంటార్లే. నీకు దెల్వదులే. అయ్యగోరికైతే బాగా దెల్సు. నా యిసయం ఆనక సెపతా గానీ, మీ సేను మద్దెన ఉన్న దొరువులో గుడ్డికొక్కిరాయిలేమైనా తగులుకున్నాయా...?" అనడిగాడు పోలేరు.
WD


"గుడ్డి కొక్కిరాయలా...? అంటే ఏమిటి...?" అన్నాడు శ్రీను.
"ఓర్నీ మడిసి సల్లంగుండ. గుడ్డికొక్కిరాయంటే దెలవదా. అదిగో దూరంగా ఆ సీంతం సెట్టు మీన
కూకునుంది సూడు. అదే గుడ్డికొక్కిరాయంటే" అంటూ సిమెంటు వర్ణంలో ఉన్న ఓ కొంగను చూపించాడు.

"దాంతో నీకేం పని..." అని అడిగాడు శ్రీను.
"ఏం పనంటే ఏం సెప్పేది. ఆటిని బట్టుకెల్లి సంతలో అమ్మితే ఓ పదో పరకో డబ్బులొత్తయ్యి. అందుకే ఆటిని బట్టుకోడానికి మీ సేను దొరువులో ఎరేశా..." అంటూ దొరువుకేసి నడిచాడు.
"ఏయ్.. ఆగాగు.. దొరువులో దిగితే ఊరుకోను" అంటూ శ్రీను కూడా వెళ్లాడు.

దొరువు వద్దకు చేరుకునేలోపే చేను మధ్యలో ఓ కొంగ చచ్చి పడి ఉంది. దాన్ని చూసిన పోలేరు..." ఇది ఏ మందో మాకో తిన సచ్చుంటద్ది" అంటూ దాని రెండు కాళ్లూ పట్టుకుని చేనును ఆనుకుని ఉన్న పొదల్లోకి ఇసిరాడు. దొరువు వద్దకు వెళ్లి ఆత్రంగా తొంగి చూశాడు. అక్కడ ఏ కొంగా వలలో పడలేదు. అంతే... ఊపిరి పీల్చుకున్నాడు శ్రీను. పోలేరు మాత్రం ఉస్సూరుమన్నాడు. దూరంగా చీమచింత చెట్టుపై వాలిన కొంగపై దృష్టి పెట్టాడు.

దొరువులో ఉన్న వలను మెల్లగా పైకి లాగి చీమచింత చెట్టుకేసి నడవసాగాడు. అతడినే అనుసరిస్తే చేను గట్టు వద్దకు వచ్చిన శ్రీనుతో "ఎట్టాగైనా ఒక్క గుడ్డికొక్కిరాయినైనా పట్టబోయానంటే ఇయ్యాల నా బొచ్చలో బొమ్మరాయే.." అంటూ అటువైపు వెళ్లిపోయాడు. అయితే అతడి సంచారాన్ని దుష్ట సంచారంగా ఆ పక్షులు గుర్తుపట్టినాయో ఏమోగానీ... ఒక్కసారిగా చెట్టుపై నుంచి తెల్లని కొంగలు పచ్చటి పొలాలపై స్వేచ్ఛగా ఎగురుతూ వెళ్లిపోసాగాయి.

వెబ్దునియా పై చదవండి