ఎక్కడో తేడా కొడుతోంది.. గుర్తించకుంటే పెను విపత్తే.. కేంద్రం హెచ్చరిక

శుక్రవారం, 27 మార్చి 2020 (18:12 IST)
కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. అయినప్పటికీ.. కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఓ సందేహాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడో తేడా కొడుతోంది.. దాన్ని గుర్తించకుంటే పెను విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందంటూ అన్ని రాష్ట్రాలను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన అన్ని రాష్ట్రాలకు ఓ లేఖ రాశారు. 
 
ముఖ్యంగా, కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన వచ్చిన వారిని గుర్తించి వారిపై పక్కా నిఘాతో పర్యవేక్షించాలని సూచించారు. పైగా, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చినవారు నిఘాలో లేరన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. 
 
విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్యకు, నిఘాలో ఉన్న వారి సంఖ్యకూ చాలా తేడా ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన ఆయన, ఈ కారణంతో ఘోర ఆపద ముంచుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
 
కరోనా వైరస్ వ్యాప్తిని పరిమితం చేసేందుకు తీసుకుంటున్న చర్యలకు ఈ వ్యత్యాసం విఘాతం కలిగించేలా ఉందని హెచ్చరించిన రాజీవ్ గౌబా, వారిపై మరింత దృష్టిని సారించాలని అన్నారు. వైరస్‌ను అరికట్టాలంటే, ఫారిన్ నుంచి వచ్చిన అందరినీ క్వారంటైన్‌లో ఉంచాల్సిందేనని అన్ని రాష్ట్రాలకు ఆయన స్పష్టమైన ఆదేశాలుజారీచేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు