కేరళలో ఖననానికి స్థలం లేదు.. నా భూమిని వాడుకోండంటూ ఢిల్లీ వాసి వినతి

సోమవారం, 20 ఆగస్టు 2018 (16:09 IST)
కేరళ రాష్ట్రంలో సంభవించిన వరద బీభత్సానికి అనేకమంది మృత్యువాతపడ్డారు. పైగా, కుంభవృష్టికారణంగా ఎటు చూసినా కనుచూపు మేరలో నీరు వరద నీరు కనిపిస్తోంది. దీంతో చనిపోయినవారిని ఖననం చేసే శ్మశానవాటికల్లో కూడా నడుంలోతు నీళ్లు నిల్వ ఉన్నాయి. దీంతో మృతదేహాల ఖననం ఓ ప్రసహనంగా మారింది.
 
ఈ నేపథ్యంలో నా భూమిని శ్మశాన వాటికగా వాడుకోండి అంటూ ఓ మానవతావాది ముందుకొచ్చాడు. తన జన్మభూమిలో వరద బీభత్సానికి మృతి చెందిన వారిని తన భూమిలో ఖననం చేయండని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఆయన పేరు కె.శామ్యూల్. వయసు 49 యేళ్ళు. జన్మస్థలం కేరళ అయినప్పటికీ.. స్థిరపడింది మాత్రం ఢిల్లీలో. 
 
ఈయన కేరళ రాష్ట్రంలోని ఆడూర్ మున్సిపాలిటీలోని ఆనంద్‌పల్లి గ్రామ నివాశి. కురువిల్ల కే. శామ్యూల్(49) తన చిన్న వయసులోనే ఢిల్లీకి వెళ్లి స్థిరపడ్డాడు. అయితే శామ్యూల్‌కు ఆనందపల్లిలో ఒక ఇల్లు, 25 సెంట్ల భూమి ఉంది. ప్రస్తుతం ఈ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. కేరళలో వర్షాలు, వరద బీభత్సానికి 350 మందికి పైగా మృతి చెందిన విషయం విదితమే. 
 
వీరందరిని తన భూమిలో ఖననం చేయండని శామ్యూల్ ట్వీట్ చేశారు. మృతుల బంధువులకు భరోసా ఇచ్చి.. వారికి కాస్త ఉపశమనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శామ్యూల్ తెలిపాడు. ఇలాంటి తరుణంలో పెద్ద మనసుతో ముందుకు వచ్చిన ఆయన్ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు