అన్ని రకాల రుణాలపై రెండేళ్ళ వరకు మారటోరియం : సుప్రీంకు తెలిపిన కేంద్రం!!

మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:42 IST)
కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. అదీ కూడా అత్యున్నత న్యాయస్థానం ద్వారా దేశ ప్రజలకు తెలియజేసింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అన్ని రంగాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా సాధారణ, మధ్యతరగతి ప్రజల జీవితాలు తలకిందులయ్యాయి. ఈ కుటుంబాల వారు రోజువారీ కుటుంబ పోషణ జరుపుకోవడమే గగనంగా మారిపోయింది. ఫలితంగా వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. కరోనా లాక్డౌన్ సమయంలో అన్ని రకాల రుణాలపై మారటోరియాన్ని ఆర్బీఐ అమలు చేసింది. అయితే, ఈ మారటోరియం కాలంలో వడ్డీలను మాత్రం ముక్కుపిండి వసూలు చేసింది. 
 
ఈ వడ్డీల వసూలును వ్యతిరేకిస్తూ, మారటోరియంను డిసెంబరు 31వరకు పొడగించాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఎదుట హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. అన్ని లోన్లకు రెండేళ్ల వరకు మారటోరియం పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. 
 
కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఆయన.. ఇప్పటికే ఈ విషయంపై కసరత్తు ప్రారంభమైందని, మార్చి 2021 వరకు మారటోరియం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం.. చెల్లించని ఈఎంఐలపై ఎలాంటి అదనపు వడ్డీ గానీ, పెనాల్టీ గానీ విధించకూడదని ఆదేశించింది. ఈ కేసును బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. అన్ని రుణాలపై రెండేళ్ల వరకు మారటోరియం పొడిగిస్తామని కేంద్రం చెప్పడంతో బడుగు వర్గాలకు ఉపశమనం లభించినట్లయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు