సారీ.. ప్రాణం పోయినా చెప్పను.. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు : రాహుల్

శనివారం, 14 డిశెంబరు 2019 (15:21 IST)
జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మేకిన్ ఇండియా కాదు.. రేప్ ఇండియా అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెను దుమారమే చెలరేగింది. మహిళా సమాజానికి రాహుల్ సారీ చెప్పాలంటూ బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు, నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. వీటిపై రాహుల్ గాంధీ స్పందించారు. "ప్రాణం పోయినా క్షమాపణ చెప్పను. మోడీ, అమిత్‌ షాయే జాతికి క్షమాపణ చెప్పాలి" అని అన్నారు. 
 
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ శనివారం 'భారత్‌ బచావో' ర్యాలీని చేపట్టింది. బీజేపీ విభజన, విధ్వంసకర విధానాలకు వ్యతిరేకంగా సభను నిర్వహించింది. ఈ భారీ బహిరంగ సభకు ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మన్మోహన్‌ సింగ్‌, చిదంబరం, పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.
 
ఇందులో రాహుల్ ప్రసంగిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోడీ స్వయంగా ధ్వంసం చేశారు. దేశం కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలో ఉల్లి ధర రూ.200కు పెరిగింది. తన పేరు రాహుల్‌ సావర్కర్‌ కాదని.. రాహుల్‌ గాంధీ అని అన్నారు. 
 
తాను క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోందన్నారు. నేను నిజాలను నిర్భయంగా మాట్లాడుతాను. నిజం మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలా? అంటూ ప్రశ్నించారు. రైతులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం బాగుపపడుతుందన్నారు. మోడీ పాలనలో దేశవ్యాప్త రైతులంతా నిస్పృహలో ఉన్నారన్నారు. మోడీ పేదల నుంచి లాక్కుని అంబానీకి దోచి పెడుతున్నారని రాహుల్‌ ఆరోపించారు. 
 
అవినీతి నిర్మూలన పేరుతో పేదల డబ్బులు లాక్కొన్నారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో కేవలం మోడీ మిత్రులో లాభపడ్డారన్నారు. ఆ ముగ్గురుకే ఆయన కాంట్రాక్టులన్నీ కట్టబెడుతున్నారంటూ ఆరోపించారు. అంతేకాకుండా, అధికారం కోసం నరేంద్ర మోడీ ఎంతకైనా తెగిస్తారంటూ సంచలన ఆరోపణలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు