వీర జవానుకు భార్య సెల్యూట్.. తుదిసారి ముద్దు.. ఐ లవ్యూ.. (video)

బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (14:49 IST)
పుల్వామా ఘటన దేశ ప్రజలను కలచివేసింది. 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లను భారత్ కోల్పోయిందని తెలిసి షాక్ తిన్నారు. సీఆర్పీఎఫ్ వీర జవాన్లకు దేశ వ్యాప్తంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఉగ్రమూకల దాడిలో జవాన్లు అమరులు కావడంపై యావత్తు ప్రపంచం నివ్వెరపోయింది.


ఈ నేపథ్యంలో పుల్వామాలో జరిగిన  ఎదురుకాల్పుల ఘటనలో మేజర్ విభూతి శంకర్ డౌండియాల్‌తో పాటు మరో ముగ్గురు అమరులైనారు. ఇంకా ముగ్గురు ఉగ్రమూకలు హతమైనారు. 
 
డౌండియాల్ భౌతిక కాయాన్ని సోమవారం ఆయన స్వస్థలమైన డెహ్రాడూన్‌కు తీసుకొచ్చారు. ఆపై గంగానది ఒడ్డున విభూతి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

పోలీసులు, భద్రతాధికారుల మధ్య ఈ అంతిమ వీడ్కోలు జరిగింది. ఈ సందర్భంగా డౌండియాల్ భార్య నికిత.. భర్తకు చివరి సారిగా ముద్దుపెట్టి.. ఐలవ్యూ అని చెప్పి, ఘన నివాళి అర్పించారు. 
 
మేజర్ డౌండియాల్, నికితల వివాహం గతేడాది జరిగింది. తొలి వివాహ వార్షికోత్సవం నాటికి సెలవు తీసుకుని ఇంటికి వస్తానని భార్యతో డౌండియాల్ చెప్పారు. కానీ మేజర్ పార్థివ దేహం భార్య కళ్ల ముందుకు రావడంతో.. ఆమె చలించిపోయారు. 
 
దీంతో నికిత.. డౌండియాల్ భౌతిక కాయం పక్కనే కూర్చొని తుదిసారి ముద్దు పెట్టుకుని.. ఐలవ్యూ అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు. జై హింద్, వందేమాతరం అంటూ భావోద్వేగంతో సెల్యూట్ చేశారు. భర్త త్యాగం తనను గర్వపడేలా చేసిందన్నారు. ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసిన అక్కడి వారు చలించిపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు