కేంద్ర బడ్జెట్ 2013-14 నేడే : నాడు మొరార్జీ దేశాయ్.. నేడు చిదంబరం!

గురువారం, 28 ఫిబ్రవరి 2013 (10:40 IST)
FILE
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లోక్‌సభలో అత్యధిక సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఉన్నారు. మొరార్జీ దేశాయ్ 8 సార్లు పూర్తి స్థాయి బడ్జెట్‌ను, రెండు సార్లు మధ్యంతర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. ఇపుడు చిదంబరం 8వ సారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా, 82వ కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ఆయన గురువారం 11 గంటలకు లోక్‌సకు సమర్పించనున్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖామంత్రులుగా 25 మంది విధులు నిర్వహించారు. వీరంతా కలిసి ఇప్పటి వరకు 81 వార్షిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టగా, ఇందులో 65 సాధారణ బడ్జెట్‌లు, 12 ఇంటీరియం బడ్జెట్‌లు, నాలుగు ప్రత్యేక బడ్జెట్‌లు ఉన్నాయి. వీటినే మినీ బడ్జెట్‌లుగా పిలుస్తారు.

మొత్తం 81 బడ్జెట్‌లలో మొరార్జీ దేశాయ్ ఇంటీరియం బడ్జెట్‌లతో కలుపుకుని మొత్తం 10 సార్లు బడ్జెట్‌ను సమర్పించగా, ఆ తర్వాత స్థానంలో చిందబరం ఉన్నారు. ఇప్పటి వరకు ఈయన ఏడు సార్లు సమర్పించగా, గురువారం తన ఎనిమిదో వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.

వెబ్దునియా పై చదవండి