మరికొన్ని గంటల్లో భూమిమీద అడుగుపెట్టనున్న సునీతా - విల్మోర్!!

ఠాగూర్

సోమవారం, 17 మార్చి 2025 (10:02 IST)
గత తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుని పోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌కు ఎట్టకేలకు భూమికి చేరుకోనున్నారు. మరికొన్ని గంటల్లో వారి తిరుగుపయనం ప్రారంభంకానుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమ్మీద ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు నాసా తాజా అప్‌డేట్‌ను ప్రకటించింది. 
 
సునీత, విల్మోర్‌ను తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. క్రూ-10 మిషన్‌లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్‌ను నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది. 
 
క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్‌ మూసివేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.45 గంటలకు మొదలవుతుంది. సోమవారం అర్థరాత్రి 12.45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక్ అన్‌డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ స్పేస్ షిప్ విజయంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది. 
 
మంగళవారం సాయంత్రం 5.11 గంటలకు భూకక్ష్యలను దాటుకుని కిందకు వస్తుంది. అదేరోజు సాయంత్రం 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్యూల్ ల్యాండ్ అవుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు