డిజిటల్ భారత్ కాదు.. నిరుద్యోగ భారతం.. స్వీపర్ పోస్టులకు బీటెక్ అభ్యర్థుల దరఖాస్తు

శుక్రవారం, 9 డిశెంబరు 2016 (13:27 IST)
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశాన్ని డిజిటలైజ్ చేసేందుకు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. కానీ, ఈ డిజిటలైజ్ భారతం కేవలం దేశంలోని పెద్ద నగరాలకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. దేశ వ్యాప్తంగా నిరుద్యోగం తాండవిస్తోంది. దీనికి నిదర్శనంగా స్వీపర్ ఉద్యోగాలకు ఎంబీఏ, బీటెక్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడమే. ఈ వాస్తవాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరంలో వెలుగుచూశాయి. 
 
అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు స్వీపర్ (సఫాయి కర్మచారీ) పోస్టు కోసం దరఖాస్తులు చేసిన వారిలో ఎంబీఏ, బీటెక్ లతోపాటు పీజీ కోర్సులు చదివిన అభ్యర్థులు బారులు తీరిన సంఘటన అందరినీ ఆలోచింపజేసింది. అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 250 స్వీపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరింది. ఈ పోస్టుకు 1.10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 
 
స్వీపరు పోస్టుకు హిందీ రాయడం, చదవడం వచ్చిన అభ్యర్థులు అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాని నిరుద్యోగం వల్ల ఎంబీఏ, బీటెక్‌లతో పాటు ఉన్నత విద్య అభ్యసించిన అభ్యర్థులు సైతం స్వీపరు పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారని అలహాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్ శ్రీవాస్తవ వెల్లడించారు. అభ్యర్థులకు డ్రెయినేజీలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడవడంలో ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇదీ మన దేశంలో నిరుద్యోగ భారతానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఉదంతం అందరినీ ఆలోచింపజేస్తుందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి