క్వార్టర్స్లోనే ఓడినా రెపిచేజ్ రూపంలో దక్కిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న మాలిక్.. పతక పట్టు పట్టేదాకా విశ్రమించలేదు. మరో విభాగంలో అద్భుతంగా ఆడిన తన సహచరి వినేష్ పొగట్ గాయంతో విలవిల్లాడుతూ స్టేడియం నుంచి వైదొలుగుతుంటే చెమర్చిన భారత అభిమానుల కంట ఆనంద బాష్పాలు రాల్చేలా చేసింది. ఒక దశలో పరాజయం అంచున నిలిచినా.. ఆఖరి క్షణాల్లో అసాధారణ పోరాటంతో పతకాన్ని అందుకున్న సాక్షి... రాఖీ పండగ రోజు భారత్కు పతక బహుమతి అందించింది.
బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంస్య పతక పోరులో సాక్షి తినిబెకోవాపై గెలిచింది. అంతకుముందు ‘రెప్చేజ్’ బౌట్లో సాక్షి 12-3తో ఒర్ఖాన్ ప్యూర్దోర్జ్(మంగోలియా)పై నెగ్గింది. క్వార్టర్ ఫైనల్లో సాక్షి 2-9తో వలెరియా కొబ్లోవా(రష్యా) చేతిలో ఓడిపోయింది. అయితే సాక్షిపై నెగ్గిన రష్యా రెజ్లర్ వలెరియా కొబ్లోవా ఫైనల్కు చేరుకోవడంతో భారత రెజ్లర్కు ‘రెప్చేజ్’లో పోటీపడే అవకాశం లభించింది.