జనసేన పార్టీ తొలి అభ్యర్థి పేరు వెల్లడి.. పవన్ కాదు.. ఇంకెవరు?

మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (16:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి 2019లో జరిగే ఎన్నికల్లో జనసేన తరపున అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలా పోటీ చేసే అభ్యర్థుల్లో తొలి అభ్యర్థి తాను కాదనీ, పితాని బాలకృష్ణ అని ప్రకటించారు. ఏపీలో జనసేన నుంచి మొట్టమొదటి బీ ఫారమ్ ఇచ్చేది పితాని బాలకృష్ణకే అని ఆయన తెలిపారు.
 
మంగళవారం హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన పితాని బాలకృష్ణ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
 
ఆ తర్వాత పవన్ మాట్లాడుతూ, తొలి బీ ఫారమ్ ఇచ్చేది పితాని బాలకృష్ణ‌కేనని, ఇంకెవ్వరికీ ఇవ్వనని అన్నారు. పితాని బాలకృష్ణ కానిస్టేబుల్‌గా చేశారు, తన తండ్రి కూడా కానిస్టేబుల్ ఉద్యోగం చేశారని, తమది పోలీస్ కులం అని నవ్వులు చిందించారు. 
 
పితానిని చూడగానే ఆయనకు టికెట్టు ఇవ్వాలనిపించిందని, ఆయన భావోద్వేగాన్ని తాను అర్థం చేసుకోగలనని అన్నారు. అందుకని, పితాని బాలకృష్ణను జనసేన మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటిస్తున్నానని పవన్ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు