ఏపీలో స్కిల్‌డెవలప్‌‌మెంట్‌పై యూనివర్శిటీ ఏర్పాటు: సీఎం జగన్

శుక్రవారం, 25 అక్టోబరు 2019 (17:54 IST)
స్కిల్‌డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్థిక, విద్యా, పరిశ్రమల శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, మేకపాటి గౌతం, సీఎస్‌ ఎల్వీ.సుబ్రహ్మణ్యం సహా ఉన్నతాధికారులు, అధికారులు హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో చేపడుతున్న నైపుణ్యాభివద్ది, ఉపాధి కల్పన కార్యక్రమాలపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాధి కల్పనలో అన్నీ మంచి ఆలోచనలే ఉన్నాయని, కాని వాస్తవం ఏంటంటే... శాఖలమధ్య సమన్వయం, సినర్జీ లేదని సీఎం వ్యాఖ్యానించారు.
 
ప్రభుత్వంలోని ప్రతిశాఖ ఈ కార్యక్రమాలపై తమకునచ్చిన రీతిలో బడ్జెట్‌ ఖర్చు చేస్తోందని, దీన్ని సంపూర్ణంగా మార్చాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. వివిధ శాఖలు చేపడుతున్న నైపుణ్యాభివద్ధి కార్యక్రమాలను ఒక గొడుగు కిందకు తేవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం రాష్ట్రస్థాయిలో కొత్తగా ఒక యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా సీఎం వెల్లడించారు. 
 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయదలచిన కాలేజీలు, మొత్తంగా 25 కాలేజీలు ఈ యూనివర్శిటీకి అనుబంధంగా పనిచేస్తాయన్నారు. ప్రభుత్వం తరపున చేపట్టే నైపుణ్యాభివద్ధి కార్యక్రమాలన్నీ ఈ యూనివర్శిటీ పరిధిలోకి వస్తాయన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖా దీంట్లో భాగస్వామ్యం అవుతుందని సీఎం చెప్పారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా, భవిష్యత్‌ అవసరాలకోసం యూనివర్శిటీ తగిన ప్రణాళికలను రూపొందిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. 
 
ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, బీకాంసహా ఇతరత్రా డిగ్రీలు  చదువుతున్నవారి నైపుణ్యాలను పెంచడం, దీంతోపాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివద్ధి ని మెరుగుపరచడం.. ఇవన్నీకూడా... యూనివర్శిటీకి లింక్‌చేద్దామన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హైఎండ్‌ స్కిల్‌కూడా విద్యార్థులకు అందించే బాధ్యతను యూనిర్శిటీ చేస్తుందని సీఎం వివరించారు. 
 
ఈ యూనివర్శిటీ, దానికింద కాలేజీల ఏర్పాటుకు సంబంధించి నెలరోజుల్లోగా కార్యాచరణ పూర్తికావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రపంచం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా అత్యుత్తమ నైపుణ్యం మన విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు ఉండాలన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు