టీడీపీ - జనసేన - బీజేపీ, మీడియాపై ఈసీకి ఫిర్యాదు చేసిన ఏపీ ఐపీఎస్‌లు!!

ఠాగూర్

ఆదివారం, 7 ఏప్రియల్ 2024 (11:27 IST)
సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారంటూ విపక్ష పార్టీలు పదేపదే ఆరోపిస్తున్నాయి. ఏపీలో పోలీసులు కేవలం అధికార పార్టీ వైకాపాకు వంతపాట పాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. కొందరు ఐపీఎస్ అధికారుల వ్యవహారశైలి కూడా ఆ విధంగానే ఉంది. దీనికి సంబధించిన అనేక సంఘటనలు పక్కా ఆధారాలతో సహా మీడియాలో వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ పోలీసుల ఫిర్యాదు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీలపై ఫిర్యాదు చేశాయి. అసత్య ఆరోపణలు చేస్తూ తమ నైతిక మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయంటూ ఏపీ పోలీసులు తమ ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ మేరకు 19 మంది ఐపీఎస్‌ అధికారులు కలిసి రాసిన లేఖను ఏపీ సీఈవో మీనా కుమార్‌కు అందజేశారు. విజయవాడ కమిషనర్ కాంతిరాణా ఈ ఫిర్యాదు లేఖను అందించారు. 
 
టీడీపీ, జనసేన, బీజేపీలు తమ అనుకూల మీడియాలో తప్పుడు కథనాలను చూపిస్తున్నారని ఏపీ పోలీసులు ప్రధానంగా ప్రస్తావించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. పదేపదే తప్పుడు కథనాలు, దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు  కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు