మరిది అక్రమ సంబంధమే నా భర్త ప్రాణాలు తీసింది : భార్య ఆవేదన

ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (16:31 IST)
తన మరిది ఓ మహిళతో కొనసాగిస్తున్న అక్రమ సంబంధమే తన భర్త ప్రాణాలు తీసిందని మృతురాలి భార్య బోరున విలపిస్తూ చెప్పుకొచ్చింది. అందువల్ల తన భర్తను కారులో సజీవదహనం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లిలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను గుర్తు తెలియని దుండగులు కారులోనే సజీహదహనం చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ కేసులో హత్యకు గురైన నాగరాజు భార్య సులోచన సంచలన విషయాలు వెల్లడించింది. తన భర్త తమ్ముడు పురుషోత్తంకు బ్రాహ్మణపల్లిలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై గత రెండు నెలలుగా గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపత్యంలో మహిళ బంధువులు పురుషోత్తంను చంపేస్తామని హెచ్చరించడంతో, అతన్ని రక్షించేందుకు బెంగుళూరుకు పంపించివేశామని తెలిపారు. 
 
ఈ క్రమంలో శనివారం రాత్రి 9 గంటలకు గోపి అనే వ్యక్తి తన భర్త నాగరాజుకు ఫోన్ చేసి ఇకపై గొడవలు జరగకుండా కాంప్రమైజ్ చేసుకుందాం రమ్మని పిలవడంతో తన భర్త కూడా గొడవలు ఫుల్‌స్టాఫ్ పెట్టొచ్చన్న ఉద్దేశ్యంతో మాట్లాడేందుకు వెళ్లి కారులోనే మంటల్లో కాలిపోయాడని బోరున విలపిస్తూ చెప్పింది. 
 
తన మరిది అక్రమ సంబంధమే తన భర్త హత్యకు కారణమని, ఈ వ్యవహారంలో తన భర్త నాగరాజుకు ఎలాంటి సంబంధం లేదని సులోచన ఆవేదన వ్యక్తం చేసింది. నాగరాజును చంపిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, సులోచన ఫిర్యాదు మేరకు బ్రాహ్మణపల్లికి చెందిన రూపంజయ,  సర్పంచ్ చాణక్యలతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే, రూపంజయను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు