అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి రోజున జైలులో చంద్రబాబు దీక్ష

ఆదివారం, 1 అక్టోబరు 2023 (09:47 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో తన అక్రమ అరెస్టును నిరసిస్తూ రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినత నారా చంద్రబాబు నాయుడు గాంధీ జయంతి రోజున నిరాహార దీక్ష చేయనున్నారు. అదే రోజున చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా రాజమండ్రిలో నిరసన దీక్ష చేస్తున్నారు. ఈ విషయాన్ని టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ(పీఏసీ) సభ్యుడు, పార్టీ సీనియర్ నేత నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. 
 
శనివారం నంద్యాలలో పీఏసీ సమావేశం జరుగుతున్న సమయంలోనే తన సోదరి భువనేశ్వరి ఫోన్ చేసి దీక్ష చేయనున్నట్లు తెలిపారని వెల్లడించారు. పార్టీ అధినేత నిరసన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలూ సోమవారం దీక్షలు చేస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. 
 
శనివారం రాత్రి టీడీపీ కేంద్ర కార్యాలయంలో "సైకో జగన్‌కు వినిపించేలా మోత మోగిద్దాం" కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఇచ్చిన పిలుపునకు స్పందించి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు 'మోత మోగిద్దాం' కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు