సచివాలయంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

శుక్రవారం, 1 జనవరి 2021 (19:33 IST)
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నూతన సంవత్సర సంబరాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సచివాలయ ఆవరణలో ఉన్న పార్కులో జరిగిన ఈ సంబరాల్లో సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అయిదు బ్లాక్ లకు చెందిన అన్ని శాఖల ఉద్యోగుల ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 కేజీల కేక్ ను సంబరాల్లో సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కట్ చేశారు.  అనంతరం ప్రతి ఉద్యోగిని ముఖ్యంగా పారిశుద్ధ్య సిబ్బందితో పలుకరించారు.

గతంలో ఢిల్లీలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న రోజులను వారితో గుర్తు చేసుకున్నారు. అనంతరం ఉద్యోగులందరికీ స్వయంగా ఆయన కేక్ తినిపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగుల పిల్లలతోనూ ఆయన ఆనందం పంచుకున్నారు.

సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట రామిరెడ్డి, ఇతర సభ్యులను దుశ్శాలువతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్ విభాగం డిప్యూటీ సెక్రటరీ సుబ్రహ్మణ్యం రెడ్డి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిఎస్ కాటమరాజు, ప్రొటోకాల్ ఎఎస్ రామసుబ్బయ్యతో పాటు సచివాలయ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు, పలువురు డీఎస్ లు, జెఎస్ లు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు