ప్రాంక్ వీడియోకు ఎన్ని లైక్‌లు వస్తాయో చూద్దామనీ... తరగతి గదిలో పెళ్లి : ప్రిన్సిపాల్

గురువారం, 3 డిశెంబరు 2020 (16:13 IST)
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మైనర్లు అయిన విద్యార్థినీ విద్యార్థి పెళ్లి చేసుకున్నారు. బాలిక మెడలో తాళికట్టిన బాలుడు.. ఆపై నుదుట పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయింది. దీంతో కలకలం రేగింది. ఆ వెంటనే స్పందించిన కాలేజీ ప్రిన్సిపాల్ మేరీ సుజాత సంబంధిత విద్యార్థులపై చర్య తీసుకున్నారు. 
 
ఇదే అంశంపై ప్రిన్స్‌పాల్ మాట్లాడుతూ, వీడియోలో ఉన్న అమ్మాయి కాలేజీ టాపర్ అని, కేవలం సరదాగా ప్రాంక్ వీడియో చేయడం కోసమే ప్రేమ వివాహం చేసుకున్నట్లు విచారణలో వెల్లడించారని తెలిపారు. అయినా ఇలాంటి పనులు కాలేజీలో చేయడం తప్పని భావించి ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్‎ ఇచ్చి, వారికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపిచామని తెలిపారు. 
 
నవంబరు 27న విద్యార్థుల తల్లిదండ్రులు పెళ్లి వీడియో తమ దృష్టికి తెచ్చారని ప్రిన్సిపాల్ మేరీ సుజాత చెప్పారు. దీనిపై తాము విచారణ జరిపినప్పుడు నవంబర్ 17వ తేదీ ఉదయం 8-30 గంటలకు ముగ్గురు విద్యార్థులు కాలేజీకి వచ్చి ఈ విధంగా చేస్తే లైక్‌లు ఎన్ని వస్తాయో చూద్దామని సరదాగా ప్రాంక్ వీడియో తీసుకున్నామని, తర్వాత భయం వేసి వెంటనే వీడియోను తొలగించామని విద్యార్థులు రాతపూర్వకంగా ఇచ్చారని ప్రిన్సిపాల్ తెలిపారు. 
 
ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పినా వినడంలేదని, తాము సరదాగా తీసుకున్నదే తప్ప.. ఎలాంటి చెడు ఆలోచన లేదని విద్యార్థులు చెప్పారని ఆమె అన్నారు. కాలేజీ ఉదయం 9-30 తెరుస్తామని, అయినా వారు 8-30 గంటలకే కాలేజీకి వచ్చి ప్రాంక్ వీడియో తీయడం తప్పని భావిస్తూ.. వారికి టీసీ ఇచ్చి పంపిచామని ప్రిన్సిపాల్ మేరీ సుజాత తెలిపారు. మొత్తంమీద ఈ వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు