ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎన్డీయే నేతలు అందరూ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరికి అభివాదం చేస్తూ వచ్చిన ప్రధానమంత్రి మోడీ, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దగ్గర ఆగారు. హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి, మీరు చేయాల్సిన పని ఇంకా చాలా వుంది. అది చేసాక వెళ్లవచ్చు అనడంతో పవన్ కల్యాణ్ నవ్వుతూ అభివాదం చేసారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా చేత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమెతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను హృదయపూర్వకంగా పలకరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన విజయాన్ని సాధించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 స్థానాలు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేవలం 22 సీట్లకే పరిమితమైంది. దీంతో దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది.