అంగన్వాడీల బలోపేతంలో 'జగన్' సర్కార్ భేష్

శనివారం, 18 సెప్టెంబరు 2021 (19:37 IST)
మహిళల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, అంగన్వాడీల బలోపేతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూపిన చిత్తశుద్ధి భేష్ అని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అభినందించారు. జాతీయ మహిళా కమిషన్, ఏపీ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గుంటూరు జిల్లా జైలులో నిర్వహించిన పోషకాహార మాసోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. 
 
తొలుత జైలు సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన వాసిరెడ్డి పద్మ జైలులోని మహిళా ఖైదీల రిజిస్టర్ ని తనిఖీ చేశారు. జైల్లో వారికి అందిస్తున్న మెనూను ఆరాతీశారు. అనంతరం మహిళా కమిషన్ డైరెక్టర్ సూయజ్ అధ్యక్షత నిర్వహించిన పోషకాహార మాసోత్సవాల అవగాహన కార్యక్రమంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ దేశ ప్ర‌జ‌లు స‌రైన పౌష్టికాహారాన్ని తీసుకోక‌పోవ‌ట‌మే అనారోగ్యానికి మూలమన్నారు.  
 
కొవిడ్‌-19 వైర‌స్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి రోజు వంద‌ల కొల‌ది ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తున్న ఈ త‌రుణంలో పౌష్టికాహారం తీసుకోవల‌సిన ఆవ‌శ్య‌క‌త మ‌రింత పెరిగిందన్నారు. ముఖ్యంగా క‌రోనా వైర‌స్ ను ఎదుర్కోవ‌టానికి శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌ట‌మే దివ్య ఔష‌ధ‌మ‌న్నారు. వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే బ‌ల‌వ‌ర్ధ‌క స‌మ‌తుల ఆహారం తీసుకోవ‌టం ఒక్క‌టే మార్గమని చెప్పారు.  ఆహారాన్ని బట్టి మన మానసిక, భౌతిక వికాసం ఉంటుందన్నారు.  విభిన్న రంగాల్లో పిల్లల శక్తి సామర్ధ్యాల ప్రదర్శనలో పౌష్టికాహారానిది ప్రధాన పాత్రగా చెప్పారు. మహిళలు పౌష్టికాహారం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆనారోగ్యాలను కొనితెచ్చుకోవాల్సి వస్తుందన్నారు.
 
 శరీరానికి కావాల్సిన శక్తి, ఎదుగుదల, పునరుత్పత్తి జీవక్రియలకు పోషకాలు తప్పనిసరన్నారు. ఆహారంలో స్ధూలపోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం‍తోనే అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయని హెచ్చరించారు. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం అధికంగా కనిపిస్తోందని...దీంతో మానసిక, శారీరక సమస్యలతోపాటు, రక్తహీనతల లోపం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ సమస్య పరిష్కారానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోషకాహారాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాలను చేపడుతున్నాయన్నారు. మహిళా కమిషన్ డైరెక్టర్ సూయజ్ మాట్లాడుతూ పోషకాహారం తీసుకోకపోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల లోపం, బరువు లేకపోవటం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయన్నారు.
 
 గర్భీణులలో పిండం సరిగా ఎదగకపోవటం, పుట్టబోయే బిడ్డ మానసిక స్ధితిపై ప్రభావం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. ప్రాథమిక దశలోనే పోషకాహార లోపాన్ని గుర్తించి దాని నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోషకాహార లోప నివారణకు సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. 
 
మహిళాశిశు సంక్షేమ శాఖ ఆర్జేడి శైలజ మాట్లాడుతూ మహిళా ఖైదీలు బయటకు వెళ్లిన తర్వాత పౌష్టికాహారం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆనారోగ్యాలను కొనితెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. శరీరానికి కావాల్సిన శక్తి, ఎదుగుదల, పునరుత్పత్తి జీవక్రియలకు పోషకాలు తప్పనిసరని..ఆహారంలో స్ధూల పోషకాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో భాగంగా మహిళా ఖైదీలకు పండ్లు, పోషకాహార పదార్ధాలు పంపిణీ చేశారు.
 
 అనంతరం మహిళా ఖైదీలతో వాసిరెడ్డి పద్మ నేరుగా మాట్లాడి వారు స్వయంగా తయారు చేసిన అల్లికలు, కుట్టిన వస్త్రాలను పరిశీలించారు. జైలులో ఎదుర్కునే సమస్యలపై ఆరా తీశారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు, పనితీరుపై జైలు అధికారులకు ఆమె సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడిపీఓలు కృష్ణవేణి, శ్రీదేవి, జిల్లా జైలు సూపరింటెండెంట్ హంసాపాల్, జైలు డాక్టర్ కె.లక్ష్మీ పూర్ణలత, జైలర్లు ఎ.శంకర్ రావు, సీహెచ్ కిరణ్, అంగన్ వాడీ సూపర్ వైజర్లు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు