ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశంలో పెను మార్పులు : కె.నారాయణ

ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (17:17 IST)
దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెను మార్పులు చోటుచేసుకోనున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శఇ కె.నారాయణ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తాన్ని కార్పోరేట్ రంగాలకు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. 
 
ఆదివారం నాడు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతు వ్యతిరేక చట్టాలతో రైతులను ముంచేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. అదానీ కంపెనీలు దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున గోడౌన్లు నిర్మిస్తున్నాయని అన్నారు. ఆదానీ, అంబానీ, ఫోస్కో కంపెనీలకు దేశాన్ని దోచి పెడుతున్నారని దుయ్యబట్టారు. 
 
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే సీబీఐ, ఎన్ఐఏ సంస్థలను ప్రయోగించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారందరినీ కేంద్రం టార్గెట్ చేస్తోందన్నారు. సీఎం జగన్ కూడా మోదీ వర్గంలోని వారేనని నారాయణ విమర్శించారు. తిరుపతి ఉపఎన్నికలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని నారాయణ పిలుపునిచ్చారు.
 
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశంలో రాజకీయంగా పెను మార్పులు జరుగుతాయని కె.నారాయణ జోస్యం చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం మోడీ.. రవీంద్రనాథ్ ఠాగూర్ వేశం వేశారన్నారు. ఎన్నికలు పూర్తవగానే వేషం మార్చేస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అంతా పశ్చిమ బెంగాల్‌లోనే మకాం వేసిందని ఆయన దుయ్యబట్టారు. 
 
బీజేపీ వస్తే పాండిచ్చేరిని అమ్మేస్తారని, అందుకే ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్‌ను గెలిపించాలని అక్కడి ప్రజలకు నారాయణ పిలుపునిచ్చారు. ఇదేసమయంలో వైసీపీ, టీడీపీపైనా నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుంటే జగన్, చంద్రబాబులు ఎందుకు మాట్లాడటం లేదని నారాయణ ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు