విజ‌య‌వాడ స‌బ్‌-క‌లెక్ట‌ర్ సేవాభావం

సోమవారం, 6 సెప్టెంబరు 2021 (06:57 IST)
విజ‌య‌వాడ‌లో రోడ్డు పక్కన నివసించే యాచకులు, అనాధలు, వలస కూలీలు వంటి నిరాశ్రయులకు ఆధార్ కార్డుతో పాటు బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులను ఎంతో ఉదారతతో సబ్ క‌లెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్ మంజూరు చేశారు.

గత 15 రోజులుగా నగరంలో రోడ్డు పక్కన చెత్త ఏరుకుంటూ, భిక్షాటన చేస్తూ  జీవనం సాగిస్తున్న ఒంటరి జీవితాలపై సర్వే చేయాల‌ని గ్రామ సచివాలయాలకు సబ్ కలెక్టర్ ఆదేశించారు.

ఈ మేరకు విజయవాడ తూర్పు గ్రామ రెవెన్యూ అధికారులు టి.కిరణ్‌కుమార్, వావిలాలపల్లి మాధురీలు తమ పరిధిలోని వాలంటీర్ల సహాయంతో సర్వే జరుపుతున్నారు. ఆ సర్వేలో భాగంగా సుమారు 12 మంది వృద్ధులు, వలస కార్మికులు, మానసిక వికాలంగులను గుర్తించి ప్రభుత్వం చేసే సహాయం అందాలంటే ప్రధానంగా ఆధార్ కార్డు అవసరం. అందువల్ల ఆధార్ కార్డు మంజూరు చేయించారు.

ఆధార్ కార్డు ఇవ్వడంలో బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉండగా కొంతమంది మానసిక వికలాంగులకు, వృద్దులకు అది సహకరించలేదు. దాంతో కంటి ద్వారా ఐరిష్‌ను నిర్ధారించి ఆధార్ కార్డులను మంజూరు చేశారు. ఇంకా సర్వే జరుగుతున్నప్పటికి సుమారు నలుగురికి బియ్యంకార్డు, ఆరోగ్యశ్రీ కార్డులను కూడా మంజూరు చేశారు.

వాలంటీర్ హరీష్ సుమారు 12 మందిని సర్వే చేసి రోడ్డు పక్కన నివసిస్తున్నారని గుర్తించారు. రోజువారీగా వారి వద్దకు వెళ్లడం, వారి ఆరోగ్య, ఆహార సదుపాయాలను తెలుసుకోవడం చేశారు. ఆహార సదుపాయాలను ప్రత్యేకంగా ప్రతి రోజు ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాలను అందజేయాలని ఆదేశిస్తూనే ఉంది. ఆ మేరకు సబ్ కలెక్టర్ సూర్యసాయికి ఒంటరిగా వుండే రోడ్డు పక్కన ప్రజలు గుర్తుకొచ్చారు. అందువల్ల ఆ మేరకు సర్వే చేయించారు. ఆ తరువాత బియ్యం కార్డు, ఆధార్ కార్డు మంజూరు చేయించారు.

బియ్యం కార్డులు ఇవ్వడంతో వారి ముఖాల్లో సంతోషం కనపడింది. బియ్యంతో పాటు తమకు ఆరోగ్యశ్రీ సేవలు లభిస్తాయని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని తూర్పు నియోజకవర్గంలో చేసిన వారిని ఆదర్శంగా తీసుకొని నగరమంతా వాలంటీర్లు, వీఆర్వోలు సర్వే చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

వారి కూడా బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలన్నారు. అర్హతగల నిరుపేదలకు ప్రభుత్వ సహాయం తప్పక అందజేయాలని ఆయన కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు