స్నేహం పేరుతో నమ్మించి.. కోర్కె తీర్చలేదని రాళ్ళతో దాడిచేసి చంపేశాడు..

బుధవారం, 31 అక్టోబరు 2018 (15:37 IST)
ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ బాలిక హత్య కేసులోని మిస్టరీ వీడింది. పక్కింటి యువకుడే ఆ బాలికను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. స్నేహం పేరుతో నటించి.. ఆ తర్వాత కోర్కె తీర్చలేదన్న అక్కసుతో బండరాయితో తలపై మోది చంపేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
రాజేంద్రనగర్‌ పరిధిలోని ఉప్పర్‌పల్లికి చెందిన మహ్మద్‌ సల్మాన్‌ అనే వ్యక్తి ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. ఈయన తల్లి బోయిన్‌పల్లి మార్కెట్‌ సమీపంలోని అంజయ్యనగర్‌లో నివశిస్తోంది. ఈ క్రమంలో తల్లి దగ్గరకు వచ్చి వెళ్లే సల్మాన్‌కు... కూలి పనులు చేసుకునే శ్రావణితో (13) పరిచయమేర్పడింది. 
 
తొలుత స్నేహపూర్వకంగా మెలిగిన సల్మాన్... ఆపై శ్రావణిపై కన్నేశాడు. కొన్నాళ్ల పాటు ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించాడు. తరచుగా అంజయ్యనగర్‌కు వెళ్తూ ఆమెను కలవడం, మాట్లాడటంతో పాటు తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి తీసుకువెళ్లడం మళ్లీ దింపడం చేసేవాడు. దీంతో శ్రావణికి అతడిపై నమ్మకం ఏర్పడింది. 
 
ఇదే అదనుగా భావించిన సల్మాన్.. ఈనెల 19వ తేదీన పథకం ప్రకారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శ్రావణిని తన వాహనంపై బయటకు తీసుకువెళ్లాడు. మార్గ మధ్యంలో ఆమె కన్నుగప్పి మద్యం కొనుగోలు చేశాడు. అక్కడ నుంచి బోయిన్‌పల్లి మార్కెట్‌ సమీపంలో ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. కొద్దిగా మద్యం తాగిన తర్వాత ఆమె వద్ద తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. 
 
తన కోరిక తీర్చమని సల్మాన్‌ ఒత్తిడి చేయగా శ్రావణి తిరస్కరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను ఆమెపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. సల్మాన్‌ ప్రవర్తనతో భీతిల్లిన శ్రావణి అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. అయినా వదలని సల్మాన్‌ సమీపంలోని రాళ్లతో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం పారిపోయినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు