రిమాండ్‌లో చంద్రబాబు .. ఇక లోకేశ్ వంతు.. ఐఆర్ఆర్ కేసులో ఏ14గా

మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (16:31 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసును కొట్టివేయాలంటూ ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదిలావుంటే, చంద్రబాబు నాయుడు కుమారుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను అరెస్టు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 
 
నారా లోకేశ్‌ను కూడా అరెస్టు చేస్తామంటూ వైకాపా శ్రేణులు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నిజం చేసేలా ఏపీ సీఐడీ పోలీసులు కేసు సిద్ధం చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ పేరును ఏ14గా చేర్చారు. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో నిందితుడిగా లోకేశ్ పేరును చేర్చింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల భూముల విలువను పెంచేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను అప్పటి సీఎం చంద్రబాబు మార్చారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. గత యేడాది ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇందులో చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి పి.నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్‌కు చెందిన అంజనీ కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు పలువురిని ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. ఇపుడు ఈ కేసును తెరపైకి తెచ్చి లోకేశ్‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు