గుంటూరును కమ్ముకున్న కరోనా.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (17:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక్క గుంటూరులోనే కరోనా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం వరకు ఈ జిల్లాలో ఏకంగా 126 కేసులు నమోదైవున్నాయి. పైగా, ప్రతి రోజూ కనీసం పది వరకు కొత్త కేసులు వెలుగు చూస్తూనే వున్నాయి. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు చేతులెత్తే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గ్రహించిన కేంద్రం తక్షణం జాతీయ విపత్తుల ప్రతిస్పందన బృందం (ఎన్.డి.ఆర్.ఎఫ్)ను రంగంలోకి దించింది. 
 
గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొహరించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు... అన్ని ప్రాంతాలను జల్లెడపట్టనున్నాయి. ముఖ్యంగా, తొలి కరోనా కేసు వెలుగు చూసిన మంగళదాస్ నగర్‌లో క్రిమిసంహారక మందులైన సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేసింది. 
 
ఇదే అంశంపై ఎన్డీఆర్ఎఫ్ అధికారి రాజీవ్ కుమార్ స్పందిస్తూ, జిల్లాలో రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలతో పాటు జనసాంద్రత అధికంగా ఉండే ప్రాతాలను తక్షణం శానిటైజ్ చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలిపారు. అలాగే, ఈ బృందాలు కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా చేపడుతోందని ఆయన చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు