ఎంపీ వంగా గీత నుంచి రక్షణ కల్పించండి... : ఆడపడుచు పుష్పాల కళావతి

మంగళవారం, 6 జూన్ 2023 (09:58 IST)
ఏపీలోని అధికార వైకాపా నేతలు తమ అధికార దర్పాన్ని బాగానే ఉపయోగిస్తున్నారు. తనమన అనే తేడా లేకుండా తమకు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిపై తమ దర్పాన్ని చూపుతున్నారు. దీంతో అనేక మంది రోడ్డెక్కి, తమ బాధను వెళ్లగక్కుతున్నారు. తాజాగా కాకినాడ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆమె ఆడపడుచు పుప్పాల కళావతి సోమవారం కాకినాడలో నిర్వహించిన స్పందనలో కలెక్టర్‌ కృతికాశుక్లాకు ఫిర్యాదు చేశారు. 
 
రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామలో ఎంపీ గీత సోదరుడు, నా భర్త అయిన పీవీవీజీ కృష్ణకుమార్‌కు వారసత్వంగా రావాల్సిన 6.50 ఎకరాల పంటభూమి, కాకినాడ నగరంలో 600 గజాల ఇంటిని ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పిల్లలు మైనర్లుగా ఉండగా, 2006లో ఎంపీ మాయమాటలు చెప్పి ఆస్తులు ఆక్రమించారన్నారు. అనంతరం ఆయన మరణించారని, ఇప్పుడు పిల్లలు పెద్దవారు కావడంతో ఆ ఆస్తుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధపడగా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. 
 
ఈ ఏడాది ఏప్రిల్‌ 9వ తేదీన మా ఇంట్లో దొంగతనం చేయించారని ఆరోపించారు. 30 కాసుల బంగారం, రూ.50 వేలు దొంగలు అపసహరించుకుని పోయారని ఆరోపించారు. దీనిపై సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సీఎం క్యాంపు కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎంపీ భర్త విశ్వనాథ్‌, మరో ఆడపడుచు భర్త కనకాల రవికుమార్‌తో కలిసి గీత మా కుటుంబాన్ని చంపాలని చూస్తున్నారని, రక్షణ కల్పించాలని కోరారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు